కేరళ మసీదులో హిందూ పెళ్లి

20 Jan, 2020 08:05 IST|Sakshi

మత సామరస్యానికి గుర్తు అన్న సీఎం విజయన్‌

అలప్పుజ : కేరళలోని చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదులో ఆదివారం హిందూ పెళ్లి జరిగింది. మసీదు ఆవరణలో హిందూ పూజారి ఆధ్వర్యంలో అంజు, శరత్‌లు ఏకమయ్యారు. ఈ పెళ్లికి వారి బంధుమిత్రులతో పాటు మసీదు పెద్దలు హాజరవడం విశేషం. పెళ్లి అనంతరం శాకాహార విందు సైతం ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురి తల్లి మసీదు పెద్దల సహాయం అర్థించడంతో ఈ పెళ్లి సాకారమైంది. పెళ్లికి మసీదు పెద్దలు 10 సవర్ల బంగారంతో పాటు రెండు లక్షల కట్నం కూడా ఇచ్చారు.

1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు మసీదు కమిటీ కార్యదర్శి నుజుముదీన్‌ అలుమ్మూట్టిల్‌ చెప్పారు. ఈ పెళ్లిపై ఫేస్‌బుక్‌ వేదికగా కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి గుర్తుగా ఈ పెళ్లి నిలుస్తోందన్నారు. సీఏఏ, ఎన్నార్సీల పేరుతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పెళ్లి ఆదర్శనీయమైనదని చెప్పారు.

మరిన్ని వార్తలు