కేరళ నర్సులంతా సేఫ్!!

17 Jun, 2014 13:18 IST|Sakshi

ఇరాక్లో.. తీవ్రవాదుల చెరలో ఉన్న టిక్రిట్ నగరంలో ఉన్న మొత్తం 44 మంది కేరళ నర్సులు భద్రంగానే ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఓ ఆస్ప్రత్రిలో పనిచేస్తున్న భారతీయ నర్సులను అంతర్జాతీయ రెడ్ క్రిసెంట్ సొసైటీ వలంటీర్లు వెళ్లి చూశారని, వాళ్లంతా గత వారం రోజులుగా అక్కడ చిక్కుకున్నారని బాగ్దాద్లోని భారత రాయబారి అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు వాళ్లంతా సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది.

కానీ, శుక్రవారం నాడు అక్కడున్న కొంతమంది నర్సుల నుంచి కాపాడాల్సిందిగా కోరుతూ తమకు సందేశం వచ్చిందని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడి విషయాలు చెప్పారు. నర్సులు కావాలంటే భారత్ వెళ్లిపోవచ్చు గానీ, వారి భద్రతకు మాత్రం తాము ఎలాంటి హామీ ఇవ్వబోమని ఆస్పత్రి వర్గాలు అన్నట్లుగా తెలుస్తోంది. ఇరాక్లో దాదాపు 200 మంది భారతీయులు పనిచేస్తుండగా వాళ్లలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు