వరుడి కోసం ఫేస్‌బుక్‌లో ప్రకటన

3 May, 2018 14:24 IST|Sakshi
వరుడు కావాలంటు ఫేస్‌బుక్‌లో ప్రకటన చేసిన కేరళ యువతి జ్యోతి కేజీ

న్యూఢిల్లీ : ఇన్ని రోజులు ఫేస్‌బుక్‌ అంటే ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయడానికి మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇక మీదట ‘మ్యాట్రిమొనియల్‌’గా కూడా మారనుందా? కేరళకు చేందిన ఓ యువతి  ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు చూస్తే నిజమే అనిపిస్తుంది ఎవరికైనా. తనకు వరడు కావాలంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేసింది ఈ యువతి. వివారాల్లోకి వెళ్తే కేరళ మలప్పురంకు చెందిన జ్యోతి కేజీ(28) తనకు వరుడు కావాలంటు పోయిన వారం ఫేస్‌బుక్‌ మ్యాట్రిమొని హాష్‌టాగ్‌ను ఉపయోగించి చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.

జ్యోతి చేసిన ప్రకటనలో ఉన్న వివరాలు...‘నా పేరు జ్యోతి. నా వయసు 28 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు మరణించారు. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతను ముంబైలో సీనియర్‌ యాడ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. నేను బీఎస్సీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తిచేసాను. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్నాను. మీకు తెలిసిన వారిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే నాకు తెలియజేయండి. నేను కులం, జాతకాల గురించి పట్టించుకోను’ అని మలాయాళంలో పోస్టు చేసింది. అంతేకాక ఫేస్‌బుక్‌ నెట్‌వర్కలో ఫేస్‌బుక్‌ మ్యాట్రిమొనియల్‌ ఫీచర్‌ను ప్రారంభించమని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌కు విన్నపం చేసింది.

తనలానే చాలామంది సరైన జీవిత భాగస్వామి వెతుకుతున్నారని, ఒకవేళ ఫేస్‌బుక్‌ మెయిన్‌ నెట్‌వర్క్‌లో ఎఫ్‌బీ మ్యాట్రిమొనిని ప్రారంభిస్తే తనలాంటి అనేకమంది అవివాహితులకు చాలా మేలు చేసిన వారవుతారని తెలిపింది. చాలామంది సరైన జీవిత భాగస్వామిని పొందడం కోసం మ్యాట్రిమొనిలు, మధ్యవర్తుల బారినపడి మోసపోతున్నారని అందువల్ల ఎఫ్‌బీ మ్యాట్రీమొనీని ప్రారంభిస్తే వారందరికీ తగిన జీవితభాగస్వామిని ఎన్నుకునేందుకు మార్గం సులువవుతుందని విన్నవించింది. జ్యోతి ఏప్రిల్‌ 26న చేసిన ఈ పోస్టు వైరల్‌ అయ్యింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 6 వేల మంది దీన్ని షేర్‌ చేశారు.

జీవిత భాగస్వామి కోసం ఇలా ఫేస్‌బుక్‌ ప్రకటన చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కేరళకు చెందిన రంజిష్‌ మంజేరి అనే ఫోటోగ్రాఫర్‌ తనకు వధువు కావాలంటూ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటన చేశాడు.

మరిన్ని వార్తలు