మండపంలో వధువు మాయం!

8 Feb, 2016 20:25 IST|Sakshi
మండపంలో వధువు మాయం!

ఓ మెజీషియన్ వధువు... తన పెళ్ళి వేడుక అతిథులందరికీ జీవితాంతం గుర్తుండిపోవాలనుకుంది. అందుకే ఏదైనా భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. మండపంలో పెళ్ళి సందడి మొదలైంది. బంధువులంతా పీటల మీదకు పెళ్ళికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె మాయమైపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు కూడ సిద్ధమైపోయారు. ఇంతలో బంగారు రంగు దుస్తులతో దట్టమైన పొగ మధ్య మండపంలో ప్రత్యక్షమైన వధువును చూసి ఖిన్నులైపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఎంతో అద్భుతంగా ఫీలయ్యారు.

కేరళ అలప్పూజ ప్రాంతంలోని ఆనంద్, అమ్ముల వివాహంలో జరిగిన ఈ అద్భుత సన్నివేశం అందరినీ ఆకట్టుకోవడంతోపాటు... స్థానికంగా వార్తలకెక్కింది. అలాగే ఆమె రిసెప్షన్ కార్యక్రమం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈసారి అమ్ము తన ఇంద్రజాల ప్రతిభతో పిల్లగాలిలో మెల్లగా కలసిపోయి... రిసెప్షన్ కు ఏర్పాటు చేసిన ఓ పెద్ద కమలం నుంచీ ప్రత్యక్షమైంది. అతిథులు, బంధువుల చప్పట్ల మధ్య కల్యాణ మండపం మారుమోగింది. వివాహ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చిన  ప్రముఖ మెజీషియన్ సమరాజ్... డైరెక్టర్ బాలచంద్రన్ తో పాటు మరో ఇద్దరు ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించి... వేడుకకు గ్లామర్ టచ్ తెచ్చి పెట్టారు.  

రచయిత రాజశేఖరన్ ముత్తుకులమ్, శ్రీలతల ఏకైక సంతానం అమ్ము.. మూడేళ్ళ వయసులోనే ఇంద్రజాలాన్ని ఎంతో ఇష్టపడేది. కళ్ళకు గంతలు కట్టుకొని వాహనాలు నడపడం వంటి అనేక ట్రిక్కులను ఆమె స్వయంగా నేర్చుకుంది.  సినిమా అండ్ టెలివిజన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె... మ్యాజిక్ లో అద్భుతాలను ప్రదర్శించి ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకుంది. వివాహ సందర్భంలో ప్రదర్శనకు అమ్మూకు ఆమె దగ్గరి బంధువులు, స్నేహితులు సహకరించారు. తన పెళ్ళి సందర్భంలో ఏదైనా ప్రత్యేకత ఉండాలన్న తన కోర్కెను అమ్మూ ముందుగానే తన తండ్రికి తెలిపింది. ఆయన అంగీకారంతో ప్రదర్శనకు అనువుగా వేదికను డిజైన్ చేయించుకుంది.

మరిన్ని వార్తలు