వికాస్‌ దూబేకి రక్షణ కల్పించిన వారి సంగతేంటి?

10 Jul, 2020 17:26 IST|Sakshi

లక్నో: ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వికాస్‌ దూబే చేతిలో హతమైన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా కుటుంబ సభ్యులు దీనిపై స్పందించారు. ‘వికాస్‌ దూబేను చంపేశారు.. మరి అతడికి సాయం చేసిన వారి సంగతి ఏంటి.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు’ అని దేవేంద్ర మిశ్రా బందువు ఒకరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను భావిస్తున్న ఏకైక న్యాయం ఏమిటంటే, ప్రస్తుతం దేవేంద్ర మిశ్రా హంతకుడు సజీవంగా లేడు అనే కారణంతో మా కుటుంబ సభ్యునికి నిర్వహించాల్సిన ఆచారాలను జరపొచ్చు. అయితే మన సమాజంలో ఒక జబ్బు ఉంది. అది ఎప్పటికి అలానే ఉంటుంది. అది ఏంటంటే వికాస్‌ దూబేకు సాయం చేసిన వారు బాగానే ఉన్నారు. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక వికాస్‌ దూబే పోతే.. అతడి స్థానంలోకి మరో పది మంది వస్తారు. దీనికి ముగింపు ఎప్పుడు’ అని ఆయన ప్రశ్నించారు.(దూబే హతం: ‘మాకు పండుగ రోజే’)

అంతేకాక ‘వికాస్‌ దూబే కేసును ఇలా ముగించడం కరెక్ట్‌ కాదు. ఎన్నికల్లో అతడి సాయం తీసుకున్న రాజకీయ నాయకుల మాటేంటి. దూబే లాంటి ఒక నేరస్తుడు పోలీస్‌ స్టేషన్‌లోనే ఒకరిని చంపి.. బయటకు వెళ్లగల్గుతున్నాడంటే దానికి కారణం ఎవరు. దీని మూలలా వరకు వెళ్లి పరిశీలించాలి. దూబే బతికి ఉంటే.. కనీసం కొంతమంది వైట్‌ కాలర్‌ నేరస్తుల గురించి అయినా తెలిసేది. వికాస్‌ దూబే కేసుకు ఇది సరైన ముగింపు కాదని నా అభిప్రాయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అన్నాడు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ దూబేను ఈ రోజు కాన్పూర్‌కు తరలిస్తున్న పోలీసు  ఎస్కార్ట్‌ వాహనం రోడ్డు మీద అదుపు తప్పి బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన వికాస్‌ గుప్తా.. పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు