తప్పుగా మాట్లాడితే దండించలేను : ఉప రాష్ట్రపతి

4 Apr, 2018 13:51 IST|Sakshi
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, న్యూఢిలీ​ : ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కాపాడాలంటే ప్రతి భారతీయుడు తమ మాతృభాషతోపాటు ఏదైనా ఒక భారతీయ భాష నేర్చుకోవాలని సూచించారు. భాష వినియోగంలో ఏవైనా తప్పులు దొర్లినా కూడా మిమ్మల్ని దండించడానికి రాజు సిద్ధంగా లేడు’ అని సభ్యులనుద్దేశించి వెంకయ్య సరదాగా వ్యాఖ్యానించారు. హిందీని ప్రచారం చెయ్యడానికి బదులు.. ప్రతి ఒక్కరు ఆ భాషను తరచుగా ఉపయోగించాలని అన్నారు. రోజూవారి కార్యకలాపాలలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

నాకూ హిందీ కొత్తే..
‘ మొదటిసారి ఢిల్లీకి వచ్చినపుడు నాకు హిందీ రాదు. అయినా ఇష్టంతో నేర్చుకున్న. హిందీయేతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు హిందీ భాషని నేర్చుకోండి. హిందీలోనే మాట్లాడండి. భాష నేర్చుకునేటప్పుడు పొరపాటు మాటలు చోటుచేసుకోవడం మామూలే. వాటికి భయపడితే ఏ భాషనూ నేర్చుకోలేం. గ్రామర్‌ తప్పులకు భయపడకుండా, స్వేచ్ఛగా మాట్లాడండి’ అని మంగళవారం జరిగిన హిందీ ప్రచార సభలో వెంకయ్య అన్నారు. మాతృభాష పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు.. ఇతర భాషలు నేర్చుకోవడం తేలికవుతుందని అన్నారు.

ఉత్తర భారతం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు ఏదైనా ఒక దక్షిణ భారత భాషను నేర్చుకోవాలని సూచించారు. తమకు బాగా వచ్చిన ఏదైనా భారతీయ భాషలో రాజ్యసభలో సభ్యులు మాట్లాడేవిధంగా కొన్ని నియమాలు రూపొందిస్తున్నామని వెంకయ్య తెలిపారు. హిందీ భాషకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో  ‘హిందీ సలహ్‌కార్‌ సమితి’ సమావేశం మూడున్నరేళ్ల క్రితం (2014 డిసెంబరు) నిర్వహించారు. ఇకనుంచి ప్రతి ఏడాది రెండుసార్లు ఈ సమావేశం నిర్వహిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు.

మరిన్ని వార్తలు