‘మీ బాస్‌తో చెప్పు నా కూతురి స్కూల్‌కి వెళ్లానని’

1 Oct, 2018 14:28 IST|Sakshi
కూతురితో కలిసి పాఠశాలకు వెళ్లిన కిరన్‌ రిజిజు

న్యూఢిల్లీ : భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లలో సాధరణంగా పిల్లల నుంచి వచ్చే కంప్లైంట్‌ తల్లిదండ్రులు తమ స్కూల్‌ ఫంక్షన్స్‌కి హాజరవ్వడం లేదని. ఉద్యోగుల ఇళ్లలోనే ఇలా ఉంటే ఇక ప్రజా ప్రతినిధుల పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటే పరిస్థితే ఎదురయ్యింది బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు. మంత్రి కుమార్తె ఢిల్లీలోని ఓ పాఠశాలలో చదువుతుంది. ఈ క్రమంలో స్కూల్‌లో ‘గ్రాండ్‌పేరెంట్స్‌ డే’ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిల్లలు తమ నానమ్మ, తాతలను తీసుకెళ్లాలి. కానీ కిరణ్‌ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. అతని తల్లిదండ్రులు తమ సొంత ఊరిలో ఉంటున్నారు. దాంతో కిరణ్‌ కూతురు తన తండ్రిని పాఠశాలలో జరిగే ‘గ్రాండ్‌పేరెంట్స్‌ డే’ ప్రోంగ్రాంకి రావాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో తండ్రి, కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణని కిరణ్‌ రిజిజు తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

దీనిలో కిరణ్‌ కూతురు ‘పప్పా..! రేపు మా స్కూల్‌లో ‘గ్రాండ్‌పేరెంట్స్‌ డే’ ఉంది. నువ్వు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా డ్యాన్స్‌ ప్రోగ్రాంని చూడాలి’ అని కోరింది. అంతేకాక ‘నువ్వు ఎప్పుడు నా స్కూల్‌కి రాలేదు.. ఇలా అయితే ఎలా పప్పా..? ఇప్పుడు నాతో పాటు రావాడానికి నానమ్మ వాళ్లు కూడా ఇక్కడ లేరు కదా..?!’ అంటూ ముద్దు ముద్దుగా అడిగింది. అందుకు కిరణ్‌ ‘ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను.. రాలేను ఎలా..? సరే.. ప్రయత్నిస్తాను.. కుదిరితే వస్తాను’ అన్నారు. అందుకు కిరణ్‌ కూతురు ‘నీకు ఆఫీస్‌ ఉందని నాకు తెలుసు పప్పా. అందుకే నువ్వు నీ బాస్‌తో నా కూతురి పాఠశాలకు వెళ్లాను అని చెప్పు. అప్పుడు నీ బాస్‌ నిన్ను క్షమిస్తాడు’ అంటూ సమాధానం చెప్పింది.

దాదాపు 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ ముద్దు ముద్దు మాటల వీడియోని కిరణ్‌ రిజిజు తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 500 మంది రిట్వీట్‌ చేశారు. వీడియోతో పాటు కూతురుతో కలిసి స్కూల్‌లో ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు కిరణ్‌. ఈ ఫోటోను కూడా దాదాపు 2000 మంది రిట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు