లకీంపూర్: అసోంలో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు పలు జిల్లాలను జలమయం చేశాయి. వందల సంఖ్యలో ఊర్లు నీళ్లలో నిలిచిపోయాయి. ఆ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల వారిని పల్లపు ప్రాంతాలవైపునకు తరలిస్తున్నారు. దాదాపు 24 జిల్లాలకు చెందిన 15 లక్షలమంది ఈ వరదల ప్రభావానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. భారీ వరదలు అసోంను ముంచెత్తుతున్న నేపథ్యంలో గురువారం కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు ఏరియల్ సర్వే నిర్వహించారు.
నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ పోర్స్, నీతి ఆయోగ్, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటికీ చెందిన అధికారులతో కలిసి ఆయన ఈ సర్వే నిర్వహించారు. అంతకంటే ముందు ఆయన లకీంపూర్లోని జిల్లా అధికారులతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితిపై వాకబు చేశారు. అలాగే, బాగా దెబ్బతిన్న పస్నోయి బాలిడాన్ అనే గ్రామాన్ని సందర్శించారు. ఒక్క లకీంపూర్ జిల్లాలోనే మూడు లక్షలమంది వరదల భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లోని నదులన్నీ కూడా నీటి మట్లాలు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు.