‘మే 7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు’

6 May, 2020 17:17 IST|Sakshi

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి,న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇందుకు మే7 నుంచి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇందుకు ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమిషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. (గుడ్ ‌న్యూస్‌: త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు..)

సామాజిక దూరాన్ని పాటించి..
దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాధాన్యతా క్రమంలో విదేశాల నుంచి భారతీయుల తరలింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో వాయు మార్గం ద్వారా 13 దేశాలనుంచి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్,  యుకె, యుఏఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకురానున్నాయన్నారు. సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుంచి 300 మందిని తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (కిచెన్‌లో బాత్‌రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’)

రక్షణశాఖ ఆధ్వర్యంలో..
భారత్‌కు రావలనుకునేవారు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించుకొని సర్టిఫికెట్ పొంది ఉండాలని మంత్రి పేర్కొన్నారు. వీరు భారత్‌కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటెన్ కేంద్రాలను నిర్వహిస్తాయని వెల్లడించారు. అదే విధంగా రక్షణశాఖ ఆధ్వర్యంలోని నౌకల ద్వారా కొన్నిదేశాల నుంచి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో కొనసాగనుందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
(‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్‌ బాటలోనే’ )

విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్రింది ప్రాధాన్య క్రమంలో భారత్ కు తరలించనున్నారు. 
1. ఆయా దేశాల నుంచి వెలి వేయబడినవారు
2. వీసా గడువు ముగిసినవారు
3. వలస కార్మికులు
4. ఆరోగ్యరీత్యా భారత్ లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైనవారు
5. గర్భిణీ స్త్రీలు
6. భారత్లో చనిపోయిన వారి బంధువులు
7. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు
8. విదేశాల్లో హాస్టల్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులు

మరిన్ని వార్తలు