జైల్లో కత్తులు, మొబైల్ ఫోన్లు!

5 Nov, 2015 15:16 IST|Sakshi

మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు జిల్లా జైల్లోని ఖైదీల నుంచి ఆరు కత్తులు, 16 మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత సోమవారం ఈ జైల్లో జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ ఖైదీలు హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, జైలు అధికారులతో కూడిన దర్యాప్తు బృందం బుధవారం నుంచి మంగళూరు జైల్లో తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ తనిఖీల్లో ఖైదీల వద్ద కత్తులు, మొబైల్ ఫోన్లే కాకుండా ఏడు మెమరీ కార్డులు, మొబైల్ బ్యాటరీలు, సిమ్‌కార్డులు, లైటర్లు, ఎలక్ట్రిక్ హీటర్లు, మొబైల్ చార్జర్, ఎలక్ట్రిక్ వైర్, కారం వంటి వస్తువులు దొరికాయి.

అయితే తనిఖీల్లో లభించిన కత్తులు ఇటీవలి ఇద్దరి హత్యల్లో వాడలేదని పోలీసులు ధ్రువీకరించారు. జైల్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేశామని చెప్పారు. సోమవారం జైల్లో జరిగిన ఘర్షణలో ప్రత్యర్థుల చేతిలో కరుడుగట్టిన నేరగాడు మదూర్ ఇసుబ్, అతని అనుచరుడు గణేశ్ షెట్టి హత్యకు గురయిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు