‘బాబోయ్‌..నా భార్య నుంచి కాపాడండి’

28 Jun, 2020 10:03 IST|Sakshi

భార్య చిత్రహింసలు పెడుతోదంటూ కోర్టును ఆశ్రయించిన ఓ భర్త

కోల్‌కతా : గృహ హింస కేసు అనగానే భార్యను భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అనుకుంటాం. అలా కాకుంటే అత్తామామలో, ఆడపడుచులో హింసించడం చూసుంటాం. అంటే ఇప్పటివరకు మహిళలే ఈ గృహహింస కేసుల్లో బాధితులుగా ఉండటం చూసుంటాం. కానీ దీనికి వ్యతిరేకంగా భార్యపై గృహహింస కేసు పెట్టాడు ఓ భర్త. భార్య పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నానని, తనను కాపాడాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన జ్యోతిర్మయి మజుందార్ ఓ సాఫ్టవేర్‌ ఇంజనీర్‌. తల్లిదండ్రులు, భార్యతో కలిసి కోల్‌కతా నగరంలో నివాసం ఉంటుంన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులను సొంతగ్రామమైన బైద్యబతిలో వదిలిపెట్టి వచ్చాడు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఇటీవల తల్లిదండ్రులను కోల్‌కతాకు తీసుకువచ్చాడు.  అత్తమామను తీసుకురావడం భార్యకు ఇష్టం లేదు. వారి వల్ల కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, అందుకే ఇంటికి తీసుకురావొద్దని భర్తను హెచ్చరించింది.

అయినప్పటికీ అత్తమామను ఇంటికి తీసుకురావడంతో ఆ రోజు నుంచి భర్తను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టింది. రోజు చెంపదెబ్బలు కొట్టడం. పిన్నులతో గుచ్చడం, సిగరేట్లతో కాల్చడం చేసేది. భార్య చిత్రహింసలు భరించలేక చివరకు జ్యోతిర్మయి మజుందార్ భీదాన్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చిత్రహింసలు పెడుతోందని, ఆమెను గృహహింస కేసు కింద అరెస్ట్‌ చేయాలని  ఫిర్యాదు చేశారు. భార్యపెట్టే చిత్రహింసను వీడియో రికార్డు చేసి పోలీసులకు చూపించాడు. అయితే చట్టాలు మహిళకు రక్షణగా మాత్రమే ఉందని చెప్పి చిన్న కంప్లైట్‌ రాసుకొని పంపించేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని జ్యోతిర్మయి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు