కోలకతా: ఓ వృద్ధురాలు కూతురి శవంతో కలిసి ఉండడం కోలకతాలోని హౌరాలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు బలవంతంగా తలుపులు పగలగొట్టి చూడగా ఈ విషయం బయటపడింది. సీనియర్ పోలీసు అధికారి సుకేష్ కుమార్ అందించిన వివరాల ప్రకారం రిటైర్డ్ స్కూల్ టీచర్ అయిన అన్నపూర్ణ(67) కూతురు తనిమా(24) తో కలిసి జీవిస్తోంది. తల్లీకూతుళ్లు చుట్టుపక్కల వారితో పెద్దగా కలిసేవారు కాదు. ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.
మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న తనిమా మరణించింది. ఇరుగుపొరుగువారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. కూతురు శవం మంచంపై పడి ఉండగా, తల్లి నేలపై పడి ఉండడాన్ని గుర్తించారు. కూతురి అనారోగ్యం మూలంగా తల్లి అన్నపూర్ణ కూడా మానసిక రోగిగా మారి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించామని, ఆ రిపోర్ట్ తర్వాత గానీ అసలు విషయం తెలియదని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.
అయితే తన బిడ్డ చనిపోయినట్టుగా తనకు తెలియదని అన్నపూర్ణ చెబుతోంది.