పైలట్‌ రోహిత్‌కు కృతజ్ఞతలు చెప్పిన కునాల్‌

31 Jan, 2020 18:31 IST|Sakshi

ఇండిగో ప్రైవేటు ఎయిర్‌లైన్‌ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పైలట్‌ రోహిత్‌కు కమెడియన్‌ కునాల్‌ కామ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 28న ఇండిగో సంస్థ విమానంలో ప్రయాణించిన కునాల్‌ అదే విమానంలో వెళ్లున్న రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామిని అసభ్యకరంగా మాట్లాడినందుకు కునాల్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఆరు నెలలపాటు కామ్రా తమ విమానాల్లో ప్రయాణించరాదని ఇండిగో విమానయాన సంస్థ వేటు వేసింది. మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్‌ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి  పిలుపునిచ్చారు. (ప్రముఖ కమెడియన్‌పై నిషేధం)   

ఈ క్రమంలో సదరు విమాన పైలట్‌ రోహిత్‌ మాటేటి ఇండిగో విమాన సంస్థకు ఓ లేఖ రాశారు. అందులో ‘కేవలం సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా ఇండిగో విమానయాన సంస్థ పనిచేసింది. ప్రయాణికుడిపై చర్యలు తీసుకునే ముందు పైలట్‌ ఇన్‌ కమాండర్‌ను సంప్రదించలేదు. విమాన సిబ్బంది చెప్పిన సూచనలను కునాల్‌ పాటించాడు. ఈ చర్యకు చాలా సార్లు క్షమాపణలు కూడా కోరాడు. కామ్రా విమానంలో కొంత విసుగు కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. కానీ అతన్ని బ్యాన్‌ చేసే అంత అసభ్యకరంగా ప్రవర్తించలేదు’ అంటూ కమెడియన్‌కు మద్దతుగా లేఖలో పేర్కొన్నారు. తన 9 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ఘటన జరగలేదని పైలట్‌ తెలిపారు. (అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్‌)

కాగా దీనిపై స్పందించిన కమెడియన్‌ కునాల్‌..‘నేను కెప్టెన్ రోహిత్ మాటేటికి నమస్కారం చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇక పైలట్ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందించి.. ఈ సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని,  ఇందుకు అంతర్గత కమిటీ దర్యాప్తును ప్రారంభించిందని ఓ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు