ప్రస్తుతం లాలూ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

27 May, 2019 15:56 IST|Sakshi

రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర మనస్థాపానికి లోనై.. భోజనం కూడా మానేశారు. రెండు రోజుల పాటు లాలూ ఆహారం తీసుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. ఇది ఇలానే కొనసాగితే.. ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం చేయాల్పిందిగా లాలూను కోరారు. చివరకు రెండు రోజుల తర్వాత..  ఆదివారం మధ్యాహ్నం లాలూ భోజనం చేశారు.

ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘లాలూకు బీపీ, షూగర్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. అలాంటిది రోజుల తరబడి భోజనం చేయడం మానేస్తే.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. దాంతో ఆయనను కన్వీన్స్‌ చేసి భోం చేయాల్సిందిగా ఒప్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంద’ని తెలిపారు. పశుగ్రాస కుంభకోణం కేసులో భాగంగా లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌ - ఆర్జేడీ కూటమిగా ఏర్పడి.. ఎన్డీఏను ఎదుర్కొని ఘోర పరాజయాన్ని చవి చూశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 39 చోట్ల విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది.

మరిన్ని వార్తలు