ఏపీకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి: ఎంపీ

10 Feb, 2020 20:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి చాలా సంక్షోభంలో ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీకి భారీ ఎత్తున నిధులు అందివ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి లెవల్‌ ఫ్లేయింగ్‌ ఫీల్డ్‌లోకి తీసుకు రావాలంటే పరిశ్రయల స్థాపనకు రాయితీలు ఇ‍వ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తేనే రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కుతుందని, రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ.13,500 రూపాయలను అందిస్తోందని, రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సీడీని ఇస్తోందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ. 15 వేలు అందజేస్తున్నామని, నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలకు కేంద్ర​ ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. 

ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో అతి తక్కువ నిధులు కేటాయించడం దారుణమని ఎంపీ విచారం వ్యక్తం చేశారు. రోజురోజుకీ వైద్యంపై ఖర్యులు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచాలన్నారు. 45 మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న టెక్స్‌టైల్స్ పరిశ్రమకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని కోరారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద ఏపి ప్రాజెక్టులను చేర్చాలని, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని సూచించారు. 

నిధులు వెంటనే విడుదల చేయాలి
రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని, దానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీలను చేస్తామని చెప్పారని.. దీని కోసం తొమ్మిది వేల కోట్లు ఇస్తామన్నారని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. విశాఖపట్నం, చెన్నై కారిడార్‌కు తక్షణమే నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న నాటి ప్రధాని హామీని అమలు చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు డిమాండ్‌ చేశారు.


ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి: ఎంపీ మార్గాని భరత్‌
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని బడ్జెట్ పై లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న వాగ్దానానికి ప్రధానమంత్రి నిలబెట్టుకోవాలని సూచించారు. ఏపీ విభజన చట్టంలోని వాగ్దానాలను అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయాలన్నారు. పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, దాని వల్ల పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధి లభిస్తుందని తెలిపారు. నేచురల్ గ్యాస్ వాహనాలను ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు