హైకోర్టు జ‌డ్జికి క‌రోనా రావాలి: లాయ‌ర్

7 Apr, 2020 21:01 IST|Sakshi

కోల్‌క‌తా: త‌న‌కు అనుకూలంగా తీర్పు రాలేద‌న్న కోపంతో జ‌డ్జికి క‌రోనా వైర‌స్ సోకాలంటూ ఓ న్యాయ‌వాది శ‌పించిన ఘ‌ట‌న కోల్‌క‌తాలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. క‌రోనా విజృంభిస్తున్న వేళ కోర్టులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అత్య‌వ‌స‌ర కేసులను మాత్ర‌మే విచార‌ణ చేప‌డుతున్నాయి. ఇదిలా ఉండ‌గా న్యాయ‌వాది బిజోయ్‌, బ్యాంకుకు లోన్ చెల్లించిని వ్య‌వ‌హారంలో ఓ పిటిష‌న‌ర్ త‌ర‌పున కేసు వాదిస్తున్నారు. అయితే లోన్ చెల్లించ‌క‌పోవ‌డంతో పిటిష‌న‌ర్‌కు చెందిన బ‌స్సును జ‌న‌వరి 15న బ్యాంకు వేలం వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ వేలాన్ని నిలిపివేయాల‌ని కోరుతూ స‌ద‌రు వ్య‌క్తి కోల్‌క‌తా హైకోర్టును ఆశ్ర‌యించాడు. అయితే ఇప్పుడు దీన్ని అత్య‌వ‌స‌ర విష‌యంగా ప‌రిగ‌ణించి విచార‌ణ చేప‌ట్ట‌లేమ‌ని, వేస‌వి సెల‌వుల అనంత‌రం విచార‌ణ‌ జ‌రుపుతామ‌ని న్యాయ‌మూర్తి దీపంకర్ దత్తా ఆదేశాలు ఇస్తున్నారు. (బాధితుల కోసం వెళ్తే.. లాయర్‌ అరెస్టు)

ఈ స‌మ‌యంలో కోపం క‌ట్ట‌లు తెంచుకున్న లాయ‌ర్ బిజోయ్ మైక్రోఫోన్‌ను విసిరికొట్ట‌డ‌మే కాక ఎదురుగా ఉన్న టేబుల్‌పై గ‌ట్టిగా చ‌రుస్తూ అత‌నికి అంత‌రాయం క‌లిగించారు. పైపెచ్చు జ‌డ్జికి క‌రోనా సోకుతుందంటూ శాప‌నార్థం పెట్టారు. దీంతో షాక్‌కు గురైన జస్టిస్‌ ద‌త్తా వెంట‌నే తేరుకుని కోర్టు ధిక్కారం కింద స‌దరు న్యాయ‌వాదిపై చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. న్యాయ‌వాది మాట‌ల వ‌ల్ల త‌న‌ భ‌విష్య‌త్తు గురించి భ‌య‌ప‌డ‌ట్లేదని, కోర్టు ప్రాధాన్య‌తే త‌న‌కు అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన అంశ‌మ‌ని జ‌స్టిస్‌ దత్తా పేర్కొన్నారు. (వీడియో కాన్ఫరెన్సింగ్‌)

మరిన్ని వార్తలు