నేడు లాయర్ల దేశవ్యాప్త నిరసనలు

31 Mar, 2017 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: న్యాయవాదులు సమ్మెలు, నిరసనలు చేపట్టకుండా నియంత్రించేలా తీసుకురావాలని ప్రతిపాదించిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లాయర్లందరూ శుక్రవారం విధులకు గైర్హాజరై నిరసనలు చేపట్టనున్నారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న లాయర్లకు పిలుపినిచ్చినట్లు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తెలిపింది. కాగా సుప్రీంకోర్టు లాయర్లు సంఘీభావం తెలుపుతూ చేతికి తెల్లని బ్యాండ్లు ధరించి విధులకు హాజరవుతారని బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు.

నిరసనల్లో తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు..
సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదుల స్వతంత్రతకు విఘాతం కలిగించేలా ఉన్న లా కమిషన్‌ సిఫారసులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని ఉమ్మడి బార్‌ కౌన్సిల్‌ తెలుగు రాష్ట్రాల్లోని న్యాయవాదులకు పిలుపునిచ్చింది. శుక్రవారం అన్ని చోట్ల కోర్టు విధులకు దూరంగా ఉండాలని న్యాయవాదులను కోరింది. లా కమిషన్‌ సిఫారసులు న్యాయవాదుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌ ఓ తీర్మానం చేసిందని, ఈ అంశంపై ఏప్రిల్‌ రెండో వారంలో సమావేశాలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని న్యాయవాదుల సంఘాలను కోరినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు