ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు

12 Dec, 2019 01:20 IST|Sakshi
లిసిప్రియా కంగుజమ్‌

మాడ్రిడ్‌: వారిద్దరూ స్కూలుకెళ్లి చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ కాలం గడపాల్సిన వాళ్లు. కానీ పర్యావరణ పరిరక్షణపై వారికున్న ఆసక్తి ప్రపంచ దేశాల నేతల ముందు వక్తలుగా మార్చింది. మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్‌ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్‌ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె తండ్రి కేకే.సింగ్‌ మాట్లాడుతూ..తమ కూతురు ఇప్పటికే 21 దేశాల్లో వాతావరణ మార్పుల గురించి ప్రసంగాలు చేసిందన్నారు.

ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్‌ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్‌ టీనేజర్‌ గ్రెటా థన్‌బర్గ్‌ (16) టైమ్స్‌ మేగజీన్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్‌ మేగజీన్‌ బుధవారం తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్‌ ఆమెను కొనియాడింది. లిసిప్రియా, గ్రెటాలు ఇద్దరూ పర్యావరణం గురించి నిరసనల్లో పాల్గొనేందుకు స్కూలుకు సైతం సరిగా వెళ్లేవారు కాదు.


టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గ్రెటా థన్‌బర్గ్‌

మరిన్ని వార్తలు