హైకోర్టు విభజనకు లైన్‌క్లియర్‌..!

31 Dec, 2018 12:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్‌క్లియర్ అయింది. భవన నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనను నిలిపివేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. జనవరి 2వ తేదీన సుప్రీంకోర్టు తిరిగి తెరచుకోనుంది. ఆ రోజున ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఈ రోజే (సోమవారమే) ఆఖరి రోజు. దీంతో హైకోర్టు విభజన ప్రక్రియ యథాతథంగా కొనసాగనుంది.  సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం విభజన ప్రక్రియ సాగనుంది. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరోవైపు ఉమ్మడి హైకోర్టు విభజన, తరలింపు ప్రక్రియకు అనుమతిస్తూ.. సుప్రీంకోర్టు జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఏపి హైకోర్టు న్యాయవాదుల సంఘం పిటిషన్‌ వేసింది. సుప్రీంకోర్టు రిజిస్టర్‌ వద్ద దాఖలైన ఈ పిటిషన్‌పై జనవరి 2న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు