-

పూరీ జగన్నాథ రథయాత్రకు లైన్‌ క్లియర్‌

22 Jun, 2020 16:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పూరీ​ జగన్నాథ రథయాత్రకు లైన్‌ క్లియర్‌ అయింది. రథయాత్రకు షరతులతో సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆలయ కమిటీ సమన్వయంతో యాత్ర చేపట్టాలని స్పష్టం చేసింది. జగన్నాథ దేవాలయ కమిటీ సరైన నియంత్రణ విధించాలని, భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించాలని, రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  పెద్దసంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడరాదని స్పష్టం చేసింది. జూన్‌ 18న ఇచ్చిన తీర్పును సవరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు అంతకుముందు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గు చూపడం ఆలయ సంప్రదాయ, చట్ట వ్యతిరేకమని పిటిషనర్‌ చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జూన్‌ 18న పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధించింది. అయితే యాత్ర నిర్వహణపై సానుకూల పరిస్థితులను లోతుగా సమీక్షించకుండా సుప్రీం తీర్పు వెల్లడించిందని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆ వర్గాలు 17 సవరణలతో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లు పరిశీలించిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.

(ఆ దేవుడే మనల్ని క్షమించడు: సుప్రీం)

మరిన్ని వార్తలు