బ్యాంకు ఖాతాకు ఆధార్‌ తప్పనిసరి

22 Oct, 2017 02:22 IST|Sakshi

స్పష్టం చేసిన రిజర్వు బ్యాంక్‌

ముంబై: బ్యాంకు ఖాతాలను ఆధార్‌ నంబరుతో అనుసంధానించడం తప్పనిసరి అంటూ భార తీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) శనివారం స్పష్టతనిచ్చింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ)కు తీసుకొచ్చిన సవరణలను అనుసరించి బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించుకోవాల్సిందేనంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానంపై ఆర్‌బీఐ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదంటూ మీడియాలో వస్తున్న వదంతులకు రిజర్వు బ్యాంకు స్పందించి తాజా ప్రకటన విడుదల చేసింది.

డిసెంబరు 31కల్లా అన్ని బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించాలని జూన్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. బ్యాంకు వారికి ఆధార్‌ను ఇవ్వకపోతే ఖాతాను నిలిపివేస్తామనీ, రూ.50 వేలకు పైబడి జరిపే లావాదేవీలకు కూడా ఆధార్‌ తప్పనిసరని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే పన్ను ఎగవేతదారులకు కళ్లెం వేసేందుకు ఆధార్, పాన్‌ను అనుసంధానించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడం విదితమే. 

మరిన్ని వార్తలు