మే 31 దాకా లాక్‌డౌన్‌: కొత్త నిబంధనలు ఇవే!

18 May, 2020 11:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. ఈ మేరకు నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు తెలుపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దేశంలో చిక్కు కుపోయిన విదేశీయులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అనుమతినిచ్చింది. అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధిస్తూ... అవసరమైన సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది.(భారత్‌లో ఒకే రోజు 5,242 పాజిటివ్‌ కేసులు)

లాక్‌డౌన్‌ 4.0: సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధలు

1. విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. మందులు, ఔషధాలు ఇతరత్రా వైద్య పరికరాలు సరఫరా చేసే విమానాలు ఎంహెచ్‌ఏ ప్రత్యేక అనుమతితో నడుస్తాయి. దేశీయ ఎయిర్‌ అంబులెన్సులు, వివిధ వర్గాలను చేరవేసేందుకు ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతి.
2. కేవలం శ్రామిక్‌ రైళ్ల ప్రయాణానికి మాత్రమే అనుమతి. అదే విధంగా నిత్యావసరాలు సరఫరా చేసే ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి.
3. కంటైన్మెంట్‌ జోన్లలోని షాపింగ్‌ మాల్స్‌ మినహా ఇతర ప్రాంతాల్లోని దుకాణాలు తెరిచేందుకు అనుమతి. సెలూన్లు, స్పాలు తెరచుకోవచ్చు.
4. ఢిల్లీ మెట్రో సహా అన్ని మెట్రో సర్వీసులు మే 31 వరకు బంద్‌.
5. సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదు. మే 31 వరకు ప్రార్థనా మందిరాలు అన్నీ మూసివేత.
6. 65 ఏళ్ల వృద్ధులు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంటికే పరిమితం కావాలి.
7. రాత్రి 7 నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసరాల నిమిత్తం, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చే వీలుంటుంది.
8. నిత్యావసరాలు సహా ఇతర వస్తువులు డెలివరీ చేసేందుకు ఇ- కామర్స్‌ కంపెనీలకు అనుమతి. అయితే కంటోన్మెంట్‌ జోన్లలో మాత్రం ఈ వెసలుబాటు ఉండదు.
9. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు మే 31వరకు మూసివేసే ఉంటాయి. అయితే రెస్టారెంట్లలో టేక్‌అవే సర్వీసులకు అనుమతి.
10. కంటైన్మెంట్‌ జోన్లు మినహా.. అంతరాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతి. బస్సులు సహా ఇతర వాహనాలు నడుపవచ్చు. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
11. పట్టణాలు, నగరాల్లో ప్రయాణాల(టాక్సీలు, ఆటోరిక్షాలు)పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. 
12. మే 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు మూసివేత.
13. స్పోర్ట్స్‌ కాంప్లెక్సులు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి. అయితే ప్రేక్షకులు మైదానానికి రావడం నిషిద్ధం.

మరిన్ని వార్తలు