లాక్‌డౌన్‌: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్‌

11 Jul, 2020 14:47 IST|Sakshi

భువనేశ్వర్‌ : భారత అగ్రశేణి స్పింటర్‌ ద్యుతీ చంద్‌  విలువైన బీఎం‌డబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధపడ్డారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎం‌డబ్ల్యూ కారును సోషల్‌ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతీనే ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘నా లగ్జరీ బీఎం‌డబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా కొనాలి అనుకుంటే నాకు మెసేంజర్‌లో సంప్రదించండి’ అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు. అయితే  ఫేసుబుక్‌లో పోస్ట్‌ పెట్టిన తర్వాత ఆమెకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తరువాత ఆ పోస్టును స్పింటర్‌ రాణి డిలీట్‌ చేశారు. కాగా ద్యుతీ 2015 బీఎం‌డబ్ల్యూ3- సిరీస్‌ మోడల్‌ను కలిగి ఉన్నారు. ఆమె దానిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. (‘నన్ను రావద్దనే సందేశం వచ్చింది’)

ఈ విషయంపై ఓ జాతీయ మీడియా ముందు ద్యుతీ మాట్లాడుతూ.. ‘టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్‌తోపాటు ఇతర ఖర్చులు కలిపి నాకు నెలకు అయిదు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇప్పడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. కానీ  నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నాను. నా ఫిట్‌నెస్‌, జర్మనీలో శిక్షణ కోసం నాకు డబ్బు కావాలి. నా శిక్షణ, డైట్‌ ఖర్చులను తీర్చడానికి దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి. కావున ఒక కారు అమ్మాలనుకుంటున్నాను’ అని తెలిపారు. అయితే ఆ కారు తనకు బహుమతిగా లభించిందా అని ప్రశ్నించగా. తను స్వయంగా కొనుగోలు చేసినట్లు ద్యుతీ వెల్లడించారు. (ఫుట్‌బాల్‌ లెజెండ్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు