లక్నో: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఓ వ్యక్తి పాలిట శాపమైంది. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేకపోవడంతో ఆమె ఎడబాటును భరించలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండాలోని రాధా కుంద్ ప్రాంతానికి చెందిన రాకేశ్ సోని(32) వివాహితుడు. అతని భార్య లాక్డౌన్కు ముందు ఆమె తల్లిగారింటికి వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆమె తిరిగి రాలేకపోయింది. అయితే తన చెంతన భార్య లేకపోవడం రాకేశ్ తట్టుకోలేకపోయాడు. తనలో తనే కుమిలిపోయాడు. ఆమె లేకుండా జీవించడం తన వల్ల కాదని భావిస్తూ.. గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. (ఇంటి పట్టున ఉండలేక.. ఆత్మహత్యాయత్నాలు)