ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు!

18 Dec, 2015 01:12 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ‘లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై రూపొందించిన నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించింది. ప్రతి ఐదేళ్లకు లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరకపోవచ్చని.. అయితే దశల వారీగా భవిష్యత్తులో సాధ్యపడుతుందని పేర్కొంది.

తొలుత ఎన్నికలను రెండు దశల్లో జరపాలని.. కొన్ని అసెంబ్లీలకు లోక్‌సభ సగకాలం పూర్తయ్యాక, మిగిలిన వాటికి లోక్‌సభ గడువు పూర్తయ్యాక నిర్వహించాలని తెలిపింది. ఈ లెక్క ప్రకారం 2016 నవంబర్‌లో తొలి దశ ఎన్నికలు జరగాలంది.
 
మధ్యవర్తిత్వ బిల్లుకు ఆమోదం: వాణిజ్య వివాదాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేసుల్లో సత్వర పరిష్కారం కోసం ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

అది అనర్హత కాదు: ఇల్లులేని కారణంగా వ్యక్తి ఓటరుగా పేరు నమోదుచేసుకోవడానికి అనర్హుడు కాడని కేంద్రం లోక్‌సభలో స్పష్టంచేసింది. ఓటర్‌గా దరఖాస్తు చేసుకున్న ఇల్లులేని వ్యక్తి.. ఫామ్6లో పేర్కొన్న అడ్రస్‌లోనే నివసిస్తున్నాడో లేడో తెల్సుకునేందుకు బూత్‌స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి నిర్ధారించుకోవాలని ఈసీ నిబంధనల్లో ఉందని లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు.
 
భూబిల్లుపై నివేదికకు మరింత గడువు: భూసేకరణ బిల్లుపై ఏర్పాటైన జేఏసీ తన నివేదికను సమర్పించటానికి బడ్జెట్ సమావేశాల తొలివారం వరకూ గడువు పొడిగించాల్సిందిగా పార్లమెంటును కమిటీ కోరాలని గురువారం నిర్ణయించింది

మరిన్ని వార్తలు