‘ఆధార్‌’ సవరణకు లోక్‌సభ ఆమోదం

5 Jan, 2019 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్, రెండు అనుబంధ చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్‌ కనెక్షన్‌ పొందేందుకు పౌరులు ఆధార్‌ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. మొబైల్, బ్యాంకు సేవలకు ఆధార్‌ తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చట్టంలో ఈ సవరణ చేశారు. ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టాల్లో సవరణలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తన ఆధార్‌ కార్డు చూపుతూ ‘ నా ఆధార్‌ కార్డులో నా పేరు, చిరునామా, నా తండ్రి పేరు మాత్రమే ఉన్నాయి. నా కులం, మతం, ఆరోగ్య పరిస్థితి ఇందులో లేవు. భారతీయులందరి ఆధార్‌ సురక్షితం. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం’ అని భావోద్వేగంతో మాట్లాడారు.  

సవరణ చట్టంలో ఏముందంటే..
► 18 ఏళ్లు నిండిన తరువాత ఆధార్‌ను రద్దుచేసుకునేందుకు మైనర్లకు అవకాశం.
► ఆధార్‌ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు
► పౌరులు స్వచ్ఛందంగా సమకూర్చిన బయోమెట్రిక్‌ వివరాలు, ఆధార్‌ సంఖ్యను సర్వీస్‌ ప్రొవైడర్లు భద్రపరచరాదు
►  ఆధార్‌ లేని కారణంగా బ్యాంక్, మొబైల్‌ సేవల్ని నిరాకరించరాదు
► వినియోగదారుల ఐడీ ధ్రువీకరణ కోసం మొబైల్‌ కంపెనీలు ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్‌ లేదా కేంద్రం జారీచేసే ఇతర పత్రాల్ని కూడా పరిశీలించొచ్చు  

మరిన్ని వార్తలు