మరో 5 ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య హోదా

21 Mar, 2020 01:58 IST|Sakshi
రమేశ్‌ పోక్రియాల్‌

లోక్‌సభలో బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌) హోదాను మరో ఐదు ఐఐఐటీలకు కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌) చట్టం–2017 కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇండి యన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు–2020ను తీసు కొచ్చారు. ఇప్పటికే ఈ జాబితాలో 15 ఐఐఐటీలు ఉన్నాయి. సూరత్, భోపాల్, భాగల్‌పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు తాజాగా జాతీయ ప్రాధాన్య హోదా ఇచ్చారు. దీంతో ఈ సంస్థల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్‌మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ లోక్‌సభలో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతోందని, దేశం పరిశోధనలు, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు.

మరిన్ని వార్తలు