కుష్టు ఉందని విడాకులు కుదరదు

8 Jan, 2019 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: విడాకులు తీసుకోవాలనుకునే భార్య/భర్త తమ జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపడం కుదరదు. ఈ మేరకు చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ‘జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపి ఇకపై విడాకులు పొందేందుకు వీలుండదు. కుష్టు నయం కాదని ఇదివరకు అందరూ భావించేవారు. కానీ, ఈ వ్యాధికి చికిత్స ఉంది’ అని వ్యక్తిగత చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి అన్నారు.

కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్షను చూపుతున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ వివాహ చట్టాల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. దేశంలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేదు. ప్రభుత్వం ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకోవద్దు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కుష్టు వ్యాధిని కారణంగా చూపి విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు