‘10 శాతం కోటా’పై కేంద్రానికి నోటీసులు

21 Jan, 2019 16:12 IST|Sakshi
మద్రాస్‌ హైకోర్టు

సాక్షి, చెన్నై/హైదరాబాద్‌: జనరల్‌ కేటగిరిలోని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఫిబ్రవరి 18లోగా వివరణ ఇవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ తమిళనాడు డీఎంకే ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. రిజర్వేషన్‌.. పేదరిక నిర్మూనలకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సామాజికంగా వెనుబడి, ఎన్నో శతాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం రిజర్వేషన్లు పెట్టారని వివరించారు.  

తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్‌
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్‌ వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల బిల్లు.. రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్‌ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది.

మరిన్ని వార్తలు