అమిత్‌షాకు అన్నం పెట్టిన దంపతులు మాయం

3 May, 2017 11:32 IST|Sakshi
అమిత్‌షాకు అన్నం పెట్టిన దంపతులు మాయం

కోల్‌కతా: వారం రోజుల కిందట చక్కటి భోజనం పెట్టి స్వాగతించిన పశ్చిమ బెంగాల్‌లోని మహాలీ కుటుంబం రెండు రోజులుగా కనిపించడం లేదు. వారికి ఏమై ఉంటుందని వారి బంధువులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాకు సైతం ఈ విషయం అంతుపట్టడం లేదు. గత వారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటనలో భాగంగా నక్సల్బరీలో భాగమైన కతియజోటే అనే గ్రామానికి అమిత్‌ షా వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు మహాలీ తెగకు చెందిన రాజు మహాలీ, ఆయన భార్య గీత భోజనం వడ్డించారు. నేలపై పరిచిన చాపమీద కూర్చుని వారిద్దరు చెరో దిక్కున ఉండగా మధ్యలో కూర్చున్న అమిత్‌ షా పప్పన్నం, సలాడ్‌తో తృప్తిగా భోంచేసి వెళ్లారు.

అయితే, ఆయన అలా వెళ్లినప్పటి నుంచి ఆ కుటుం‍బంపై స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండటమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రాజు పెయింటర్‌గా పనిచేస్తుండగా గీతా మాత్రం పొలం పనులకు వెళుతుంటుంది. ప్రస్తుతం వీరిద్దరు గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతకుముందే బీజేపీ నేత దిలీప్‌ బారుయి కూడా ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారంట. సిలిగురి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రవీణ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ టీఎంసీ నేత గౌతం దేవ్‌ వారిని కిడ్నాప్‌ చేశారంటూ ఆరోపించారు.

మరిన్ని వార్తలు