మరాఠా కోటా బిల్లుకు మహా అసెంబ్లీ ఆమోదం

29 Nov, 2018 15:13 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్‌ కల్పించే మరాఠా కోటా బిల్లును గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరాఠాలకు రిజర్వేషన్‌ బిల్లును ఆమోదం కోసం ఎగువ సభకు పంపారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందిన అనంతరం బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ధన్యవాదాలు తెలిపారు.

మరాఠా కోటా అంశానికి సంబంధించి బీసీ కమిషన్‌ సిఫార్సులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు పేజీల నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వం సభ ముందుంచింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠాలు కొద్దినెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ధంగర్‌ వర్గీయులకు రిజర్వేషన్ల కోటాపై సబ్‌ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని సీఎం ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు