టికెట్‌ ఇవ్వలేదుగా.. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు?

27 Mar, 2019 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముం‍బై : ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ గాంధీభవన్‌లో ఉన్న కుర్చీలన్నింటినీ తీసుకువెళ్లిపోయారు. కాంగ్రెస్‌ అధిష్టానం మెచ్చిన అభ్యర్థే ప్రచార కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి గానీ, ఉచితంగా వచ్చిన వాటితో పబ్బం గడపడం ఏమిటని ప్రశ్నించారు. సిల్లోడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్సీ సుభాష్‌ జంబాద్‌కు ఆ టికెట్‌ను కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అబ్దుల్‌ సత్తార్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా మంగళవారం కాంగ్రెస్‌- ఎన్సీపీ సంయుక్తంగా షాగంజ్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించే కార్యక్రమానికి అనుచరులతో కలిసి వెళ్లి 300 కుర్చీలను తీసుకువెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న పార్టీ వర్గాలు సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చాయి.

ఈ విషయం గురించి అబ్దుల్‌ సత్తార్‌ మాట్లాడుతూ... ‘ అవును అవి నా కుర్చీలు. కాంగ్రెస్‌ సమావేశాల కోసం నేను సమకూర్చినవి. ఇప్పుడు పార్టీని వీడాను. అందుకే నా కుర్చీలు నేను వెనక్కి తెచ్చుకున్నా. టికెట్‌ వచ్చిన వారే ప్రచార కార్యక్రమాల కోసం, పార్టీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు.కాగా స్థానికంగా అబ్దుల్‌ సత్తార్‌కు మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు ఉంది. అనుచరగణం కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి జంబాద్‌ మాట్లాడుతూ..‘ సత్తార్‌కు అవసరం ఉండటబట్టి, అవి ఆయన కుర్చీలు కాబట్టి తీసుకువెళ్లారేమో. మరేం పర్లేదు. ఆయన ఇప్పటికీ మా పార్టీ సభ్యుడే. సత్తార్‌ రాజీనామాను కాంగ్రెస్‌ ఇంకా ఆమోదించలేదు’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు