‘మహా’ రాజకీయం : ఎమ్మెల్యేలు జారిపోకుండా..

12 Nov, 2019 09:08 IST|Sakshi

విల్లా ఖర్చు రోజుకు 1.20 లక్షలు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండటంతో వేరేపార్టీ వలలో తమ ఎమ్మెల్యేలు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ముందస్తు చర్యలకు దిగడం తెల్సిందే. మహారాష్ట్రలో గెల్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లోని బుయెనా విస్టా రిసార్ట్స్‌కు తరలించింది. ఈ రిసార్ట్‌లోని 50 విల్లాల్లో ఎమ్మెల్యేలు బస చేస్తుండగా ఒక్కో విల్లా రోజువారీ టారిఫ్‌ దాదాపు రూ.1.20 లక్షలు. ప్రతి విల్లాకు ఒక ప్రైవేట్‌ స్విమ్మింగ్‌పూల్‌ వంటి హంగులున్నాయి. ఎమ్మెల్యేల దృష్టి ఇతర అంశాలపైకి పోకుండా ఉండేందుకు వరుసగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు అంచనా. బ్యుయెనా విస్టా రిసార్ట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం గార్డెన్‌ విల్లా ఒకరోజు టారిఫ్‌ రూ.24వేలు ఉండగా, ప్రైవేట్‌ పూల్‌తో కూడిన హెరిటేజ్‌ విల్లాకు రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాయల్‌ ఎగ్జిక్యూటివ్‌ విల్లాకైతే ఏకంగా రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది.  

మూడు దశాబ్దాల బంధం ముగిసింది! 
శివసేనకు చెందిన ఏకైక మంత్రి అరవింద్‌ సావంత్‌ మోదీ కేబినెట్‌ నుంచి రాజీనామా చేయడంతో హిందుత్వ భావాలున్న ఏకైక భాగస్వామ్య పారీ్టతో బీజేపీ మూడు దశాబ్దాల బంధం ముగిసినట్లయింది. సీట్ల పంపిణీ కుదరక రెండు పారీ్టలు 2014 శాసనసభ ఎన్నికల్లోనే విడివిడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచి్చంది. అనంతరం స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలం పెంచుకుంటూ వస్తోంది.

దీంతో మోదీ, అమిత్‌ షాల నేతృత్వంలో హిందుత్వ సిద్ధాంతంతో నడుస్తున్న బీజేపీ నీడలో ఉండాల్సిన పరిస్థితి శివసేనకు ఏర్పడింది. వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే‡ ఉన్నంత కాలం మహారాష్ట్రలో ఒక వెలుగువెలిగిన తమను బీజేపీ తుడిచిపెడుతుందనే అనుమానాలు శివసేనలో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతోనే శివసేన అనుమానం మరింత బలపడింది. కోరిన మంత్రి పదవి ఇవ్వనందునే కేంద్ర కేబినెట్‌లో శివసేన తమ నేత అనిల్‌ దేశాయ్‌ను చేరనివ్వలేదు. అధికార పక్షం తీరుపై పార్టీ పత్రిక సామ్నాలో ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.  

మరిన్ని వార్తలు