సచిన్‌కు భద్రతను కుదించిన ప్రభుత్వం

25 Dec, 2019 13:13 IST|Sakshi

సాక్షి, ముంబై : క్రికెట్‌ దేవుడు, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్‌ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అంటే ఇప్పటి నుంచి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదు. కానీ ఎస్కార్ట్‌ సదుపాయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు మాత్రం భద్రతను పెంచారు. ఆదిత్యకు ఇప్పుడున్న వై ప్లస్‌ సెక్యూరిటీ నుంచి జెడ్‌ ప్లస్‌కు పెంచారు. ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం ఆయా వ్యక్తులకున్న ముప్పును పరినణనలోకి తీసుకొన్న తర్వాత ఈ విషయంపై ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకొంది. బీజేపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేకు ఉన్న వై సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఇకపై ఆయనకు ఎలాంటి భద్రత ఉండదు. మరో బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు జెడ్‌ ప్లస్‌ నుంచి ఎక్స్‌ కేటగిరీకి మార్చారు. కాగా మహారాష్ట్రలో 97 మందికి ఇలాంటి భద్రతా సదుపాయాలు ఉండగా, 29 మందికి భద్రతా కేటగిరీలో మార్పులు చేశారు. 

మరిన్ని వార్తలు