పరామర్శించడానికా.. ఎంజాయ్‌ చేయడానికా!..

9 Aug, 2019 17:14 IST|Sakshi

సాక్షి, ముంబై: వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మహారాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి గిరీష్‌ మహాజన్‌ సెల్ఫీ వీడియోల వ్యవహారం వివాదాస్పదమైంది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో సాంగ్లీ, కొల్హాపూర్‌ జిల్లాలో అధిక భాగం ముంపుకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం బాధితులను పరామర్శించటానికి మంత్రి  అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన రెండు వీడియోలు బయటకొచ్చాయి. ఒక దానిలో ఆయన నవ్వుతూ, చేతులూపుతుండగా, మరో వీడియోలో రోడ్డు మీద నిలబడి ముంపు ప్రాంతాలను చూస్తున్నట్టు ఉంది. దీంతో నువ్వు బాధితులను పరామర్శించడానికి వెళ్లావా? లేక టూర్‌ ఎంజాయ్‌ చేయడానికి వెళ్లావా? అంటూ ప్రతిపక్ష ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండే మండిపడ్డారు. అంతేకాక, ఇలాంటి చర్యకు పాల్పడిన మంత్రిని క్యాబినెట్‌ నుంచి తొలగించి, సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, పశ్చిమ మహారాష్ట్రలో ఉన్న ఈ రెండు జిల్లాల్లో వరదల వల్ల ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మరిన్ని వార్తలు