రూ. 30 కోట్లు లంచమడిగి.. దొరికిన మంత్రిగారి పీఏ

14 May, 2016 20:34 IST|Sakshi
రూ. 30 కోట్లు లంచమడిగి.. దొరికిన మంత్రిగారి పీఏ

ముంబై: భూమి కేటాయింపులకు సంబంధించి రూ. 30 కోట్ల లంచం డిమాండ్ చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే పీఏను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త రమేశ్ జాదవ్.. తన భూమికి సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వాలంటూ మంత్రి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. ఖడ్సే పీఏగా చెప్పుకొంటున్న గగన్ జన్ పాటిల్ లంచం డిమాండ్ చేశారు.

థానే జిల్లాలోని కళ్యాణ్ తాలుకాలో ఉన్న నిల్జే గ్రామంలో భూముల వివరాల కోసం జాదవ్ ను పాటిల్ 30 కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. 2004 లో నిల్జే తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం 37 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలానికి సంబంధించిన కాగితాలు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో ఎన్ఓసీ కోసం గత కొద్ది రోజులుగా జాదవ్ పాటిల్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. మొదట్లో కోటి రూపాయల నగదుతో పాటు ఫ్లాట్ ఇవ్వాలని కోరిన పాటిల్ తర్వాత రేటు పెంచేశాడని తెలిపారు.

దీంతో జాదవ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆశ్రయించగా.. పోలీసులు పాటిల్ ను పట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఖడ్సే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పాటిల్ తన నియోజకవర్గంలో చికిత్సల కోసం వచ్చే వారిని ముంబైకి తీసుకువచ్చే ఒక కార్యకర్తగా మాత్రమే తనకు తెలుసునని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు పరంగా పాటిల్ ను తన కార్యాలయంలో నియమించుకోలేదని వివరించారు.

>
మరిన్ని వార్తలు