భారీ ఉగ్ర కుట్ర భగ్నం

16 Jan, 2020 19:43 IST|Sakshi

శ్రీనగర్‌ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భారీ ఉగ్ర కుట్రను శ్రీనగర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడితో 40 మంది జవాన్లను బలితీసుకున్న జైషే మహ్మద్‌ భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక జైషే ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో భారీ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను అజీజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సహిల్‌ ఫరూక్‌ గోజ్రి, నజీర్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించారు. జైషే శిబిరాన్ని భగ్నం చేయడం ద్వారా శ్రీనగర్‌ పోలీసులు భారీ ఉగ్రదాడి ప్రమాదం నుంచి తప్పించారని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ఐఈడీతో పాటు 140 గిలెటిన్‌ స్టిక్స్‌, 40 డిటోనేటర్లను పోలీసులు సీజ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు