పనామా లిస్టులోనూ మాల్యా

9 Apr, 2016 07:54 IST|Sakshi
పనామా లిస్టులోనూ మాల్యా

♦ తాజా లీక్స్‌లో వెల్లడి
♦ రుచి గ్రూపు ప్రమోటర్, ఒబెరాయ్ హోటల్స్ పేర్లూ తెరపైకి
♦ బహమాస్, యూఎఈ, సీషెల్స్‌లోనూ కంపెనీలు
♦ వీటితోనే విదేశాల్లో ఆస్తుల కొనుగోలు
 
 న్యూఢిల్లీ: భారతదేశ బ్యాంకులు ఉద్దేశపూర్వక బకాయిదారుగా గుర్తించిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా రెండు నెలలక్రితమే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో కొత్త కంపెనీని కొన్నట్లు పనామా పేపర్స్ తాజా లీక్‌లో వెల్లడైంది. దీంతో పాటు ప్రముఖ హోటల్స్ కంపెనీ ఒబెరాయ్, 6 బిలియన్ డాలర్ల రుచి గ్రూపు ప్రమోటర్‌తోపాటు ఢిల్లీకి చెందిన దంపతులు, ప్రముఖ తేయాకు వ్యాపారి కోడలితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి.

భారతదేశ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పు ఉన్న కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని మాల్యాకు బ్రిటిష్ వ ర్జిన్ ఐలాండ్స్‌లో పెద్ద కంపెనీ ఉన్నట్లు వెల్లడైంది. ‘వెంచర్ న్యూ హోల్డింగ్స్ లిమిటెడ్’ అనే కంపెనీ నేరుగా మాల్యా పేరుతోనే ఉందని తేలింది. ఈ కంపెనీని 2016 ఫిబ్రవరి 15నుంచి మాల్యా నిర్వహిస్తున్నట్లు పనామా పేపర్లలో వెల్లడైంది. బెంగళూరులోని విఠల్‌మాల్యా రోడ్డులోని మాల్యా నివాసం నుంచే ‘వెంచర్ న్యూ హోల్డింగ్స్ లిమిటెడ్’ కంపెనీ వ్యవహారాలన్నీ  నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

 పీఆర్‌ఎస్ ఒబెరాయ్, దీపక్ మధోక్
 2010లో ఒబెరాయ్ గ్రూపు, హాంకాంగ్‌లోని అమెక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ కంపెనీలో 45.8 శాతం (45 మిలియన్ డాలర్ల ఒప్పందం) వాటాలున్నట్లు ప్రకటించింది. అమెక్స్ ద్వారా విదేశా హోటళ్లను నిర్వహిస్తామంది. అయితే పనామా లీకేజీలో మాత్రం అమెక్స్‌తోపాటు జే అండ్ డబ్ల్యూ ఐఎన్‌సీ (బహమాస్), ఇతర విదేశీ కంపెనీల్లో ఒబెరాయ్ గ్రూపు డెరైక్టర్లుగా ఉన్న పీఆర్‌ఎస్ ఒబెరాయ్, దీపక్ మధోక్‌కు వాటాలున్నట్లు తెలిసింది.

 ఉమేశ్ శాహ్రా, ప్రమోటర్ ‘రుచి’ గ్రూపు
 6 బిలియన్ డాలర్ల విలువైన రుచి గ్రూపు ప్రమోటర్ ఉమేశ్ శాహ్రాకు పనామాలో రెండు ప్రైవేటు ఫౌండేషన్లతోపాటు మొత్తం 8 విదేశీ కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. వన్ వరల్డ్ ట్రస్ట్, ద త్రీవెల్స్ ఫౌండేషన్‌లు ఈ గ్రూపులోనివేనంది. 2014లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణంలోనూ ఉమేశ్ శాహ్రా పేరుంది.

 చేతన్ కపూర్, కబీర్ కపూర్.. పనామా లీక్‌లో చేతన్, కబీర్‌లకు సంబంధించి 499 పత్రాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొసాక్ ఫొన్సెకా సాయంతో పనామాలో 2010లో ‘ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చారిటబుల్ ఫౌండేషన్’ను కొనుగోలు చేశారు. అంతకుముందు 2007లో ఓప్లర్ అనే కంపెనీని 6,750 డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2013 జనవరిలో చేతన్ కపూర్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డుకు 4.9 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించారని పత్రాల్లో వెల్లడైంది.

 ఐదోరోజు వెల్లడైన మరికొన్ని పేర్లు
 అమయా కలెక్షన్స్ యజమాని అమృతా ఝవేరీకి సీషెల్స్‌లో కంపెనీలున్నట్లు తెలిసింది. ఢిల్లీ వ్యాపారి సత్యప్రకాశ్ గుప్త మొసాక్ ఫొన్సెకా సాయంతో రస్ అల్‌ఖైమాలో స్టెర్లింగ్ గ్లోబల్‌పార్ట్‌నర్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేసినట్లు వెల్లడైంది. అస్సాం తేయాకు పరిశ్రమ రారాజుగా వెలుగొందిన హేమేంద్ర ప్రసాద్ బరూవా కోడలు గార్గికీ పనామాలోని వాకర్స్ ఫౌండేషన్‌ను 2010లో కొన్నారు. ఢిల్లీలోని దామోదర్ సునిధి వెంచర్స్ డెరైక్టర్లు నిమిత్త్ రాయ్ తివారీ, అంకితా సెహగల్(దంపతులు)లకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో సన్‌సెల్ హోల్డింగ్స్ ఎస్‌ఏ అనే కంపెనీ ఉంది. కాగా,  పనామాతోపాటు టాక్స్ హెవెన్స్‌గా మారిన పలు దేశాలు.. మనీలాండరింగ్ విషయంలో కఠినమైన చట్టాలను అయలు చేయకపోతే ఆంక్షలు తప్పవని యురోపియన్ యూనియన్ హెచ్చరించింది. కాగా, విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల నుంచి తను లాభపడినమాట వాస్తవమేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అంగీకరించారు.

మరిన్ని వార్తలు