కోల్కతా : పుల్వామా ఉగ్రదాడిపై ముందుగానే సమాచారం ఉన్నా ఎందుకు చర్యలు చేపట్టలేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై మండిపడ్డారు. ఉగ్ర దాడిపై ప్రభుత్వానికి ముందస్తు సంకేతాలు అందినా ఆ ప్రాంతంలో వాహనాలను స్వేచ్ఛగా తిరిగేలా ఎలా అనుమతించారని నిలదీశారు.
దేశంలో మోదీ-అమిత్ షాలు ఇద్దరు మాత్రమే దేశ భక్తులు కాదని దీదీ చురకలంటించారు. ఉగ్రవాదానికి మతం లేదన్న మమతా బెనర్జీ మతపరంగా ప్రజలను విడదీసే కుయుక్తులు బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. మోదీ, అమిత్ షాలు వారే దేశభక్తులు అన్నట్టుగా రోజుకో ప్రకటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని నిఘా వర్గాల సమాచారం ఉందని దీదీ పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాపింగ్పై తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానన్నారు.