కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే ఎవరికైనా పతనంతప్పదని హెచ్చరించారు. ఈద్ సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ ఎదుగుదల సూర్యోదయం వంటిదని, మళ్లీ ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు.
ఈవీఎంల అక్రమాలకు పాల్పడి గెలిచిన బీజేపీ త్వరలోనే ప్రజల ఆదరణను కోల్పోక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు బెంగాల్లో బీజేపీ జై మహాకాళి నినాదాన్ని అందిపుచ్చుకోవడం పట్ల తృణమూల్ స్పందించింది. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించిన బీజేపీ శ్రేణులు ఇప్పుడు అది ఫలితాలు ఇవ్వదని గ్రహించి నినాదం మార్చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. మతాన్ని బీజేపీ రాజకీయాలతో ముడిపెడుతున్నదని ఆక్షేపించారు.