సాక్షి, కోల్కతా : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీస్ సహా కీలక వ్యవస్థలను అధికార దుర్వినియోగం ద్వారా కాషాయ పార్టీ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజ్ వ్యాలీ, శారదా చిట్ఫండ్ స్కామ్లకు సంబంధించి కోల్కతా డీఐజీకి సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.సీబీఐ సమన్లు అందుకున్న కోల్కతా డీఐజీకి ఆమె సంఘీభావం ప్రకటించారు.
బీజేపీ కేంద్ర నాయకత్వం రాజకీయ ప్రత్యర్ధులపై కక్షసాధించడంతో పాటు పోలీస్ వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్ధలనూ ధ్వంసం చేసేందుకు వాటిని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు మమతా సర్కార్ బెంగాల్లో బీజేపీ నేతల ప్రచార ర్యాలీలను అనుమతి నిరాకరించడం ద్వారా అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరించిన బెంగాల్ అధికారులు తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతి నిరాకరించారు.