కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..

27 May, 2015 13:15 IST|Sakshi
కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..

పిలిబిట్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిట్‌లో అమానుషం చోటుచేసుకుంది. కట్నం కోసం ఓ భర్త రాక్షసంగా ప్రవర్తించాడు. భార్య అనే కనికరం కూడా లేకుండా కత్తెరతో ఆమె ముక్కు, జడ కోశాడు.  కోత్‌వాలీ పూరాన్‌పూర్‌లో ఈ దారుణం బుధవారం ఉదయం వెలుగు చూసింది.  స్థానికంగా నివాసం ఉండే ఆలమ్ భార్య రుబీనాను కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. రూ.20వేలతో పాటు బైక్ ఇవ్వాలంటూ అత్తమామలను డిమాండ్ చేశాడు. అయితే కట్న దాహం తీరకపోవటంతో ఆలమ్ ఈ దారుణానికి తెగబడ్డాడు.

వెంటనే స్పందించిన స్థానికులు రుబీనాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం  నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆలమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు