సిబ్బంది నిర్లక్ష్యం.. ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులను..

4 Jul, 2019 12:26 IST|Sakshi

భోపాల్‌ : ఇండోర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోగులన్న కనికరంలేకుండా ఎక్స్‌రే పరీక్షల నిమిత్తం ఇద్దరు(ఆడ,మగ) రోగులను ఒకే స్ట్రెచర్‌పై తరలించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని కంద్వా జిల్లాకు చెందిన సంగీత అనే మహిళ కుడికాలుకు తీవ్ర గాయమైన కారణంగా కొద్దిరోజుల క్రితం ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో ఆమె కాలుకు పరీక్షలు చేసిన వైద్యులు ఎక్స్‌రే తీయాలని సూచించారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నకారణంగా స్ట్రెచర్‌పై ఎక్స్‌రే రూముకు తీసుకెళ్లాలని ఆమె భర్త ధర్మేంద్ర ఆసుపత్రి సిబ్బందిని కోరాడు.

అయితే ధర్మేంద్ర వద్దని ఎంత వారించినా వినకుండా ఒకే స్ట్రెచర్‌పై సంగీతను, మరో మగ రోగిని ఆసుపత్రి సిబ్బంది ఎక్స్‌రే రూముకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో స్పందించిన సంబంధిత అధికారి ఎస్‌ఎస్‌ ఠాకూర్‌.. సంఘటన జరిగినపుడు విధుల్లో ఉన్న సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, వార్డ్‌ బాయ్‌లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆసుపత్రిలో స్ట్రెచర్లతో పాటు ఇతర సదుపాయాల కొరత ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు