న్యూఢిల్లీ: తాను శాస్త్రవేత్త అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న మోసకారి మొగుడి వ్యవహారాన్ని బయటపెట్టింది ఢిల్లీకి చెందిన ఓ యువతి. హరియాణాలోని రేవారికి చెందిన జితేందర్ అనే వ్యక్తి ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నానని చెప్పి ఢిల్లీకి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాను ఇస్రోలో చేరడానికి ముందు రక్షణరంగ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో సైంటిస్ట్గా పని చేశానని నిరూపించడానికి బోగస్ పత్రాలు చూపించాడు. పెళ్లైన కొద్ది రోజులకే నాసాలో వ్యోమగామిగా శిక్షణ పొందడానికి వెళుతున్నానని అబద్ధం చెప్పి అమెరికా వెళ్లాడు.
అమెరికా నుంచి వచ్చాక పని మీద బెంగుళూరు వెళుతున్నానని అబద్ధం చెప్పి గుర్గావ్ చేరుకున్నాడు. అయితే తమ నెట్ఫ్లిక్స్ షేరింగ్ అకౌంట్లో చూడగా జితేందర్ గుర్గావ్లో ఉన్నట్లు ఆ యువతి గుర్తించింది. ఈ విషయమై భర్తను నిలదీయగా తాను నిరుద్యోగినని, తనకు ఇంతకు ముందే పెళ్లయినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించగా, బండారం బట్టబయలు కావడంతో అతను మొదటి భార్యతోసహా పరారయ్యాడు. కాగా జితేందర్పై రేవారి స్టేషన్లో వరకట్నం కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.