మార్ఫింగ్‌ ఫోటోలతో యువతులకు వేధింపులు

16 Feb, 2017 17:30 IST|Sakshi
మార్ఫింగ్‌ ఫోటోలతో యువతులకు వేధింపులు

శ్రీనగర్‌, నొయిడా:
తమ మాట వినటం లేదనే ఆగ్రహంతో మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో యువతులను వేధించటం మొదలుపెట్టారు. వాటిని భరించలేక బాధిత యువతులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనగర్‌, నొయిడాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. జమ్మూకశ్మీర్‌లో అనంతనాగ్‌ జిల్లా హిత్మూరా పట్టణానికి చెందిన అబ్రార్‌ అహ్మద్‌ స్థానిక యువతిని ప్రేమించాడు. వేరే కారణాలతో కొంతకాలం క్రితం వారిద్దరూ విడిపోయారు. అయితే, ఇది ఇష్టంలేని యువకుడు అహ్మద్‌ ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో ఉంచిన బాధితురాలి ఫొటోలను సేకరించాడు. ఫొటోషాప్‌ ద్వారా మార్ఫింగ్‌ చేసి యువతి చేతుల్లో మద్యం బాటిల్‌తోపాటు పిస్టల్‌ను ఉంచి యువతి మిత్రులకు పంపాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఈనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతనిపై 354-డి, 506 ఆర్పీసీ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో...గ్రేటర్‌ నొయిడా బీటా-1 సెక్టార్‌కు చెందిన ఓ యువతి ఈమెయిల్‌ అకౌంట్‌ ఇటీవల హ్యాక్‌ అయింది. అందులో ఉన్న బాధితురాలి ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తి కాపీ చేసుకుని, మార్ఫింగ్‌ చేశాడు. అశ్లీలకరంగా వాటిని మార్చివేయటంతోపాటు ఓ అసభ్యవీడియోలో కూడా ఆమె ఫొటోతో మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌సెల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి బాగా సన్నిహితులైన వారే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు