నడి రోడ్డుపై శవం.. పట్టించుకోని జనం

23 Jun, 2020 17:30 IST|Sakshi
రోడ్డుపై పడిఉన్న వృద్ధ మృతదేహం

సాక్షి, చెన్నై : కరోనా భయం మానవత్వాన్ని దూరం చేసింది. కళ్ల ముందే ఓ వృద్ధ శవం గంటల తరపడి రోడ్డుపై ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. మృతదేహాన్ని చూసుకుంటూ వెళ్లారే కానీ ఒక్కరు కూడా దగ్గరకి వచ్చి ముట్టుకోలేదు. చివరకు పోలీసులే వచ్చి ఓ రిక్షాలో మృతదేహాన్ని తరలించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన ఓ వృద్ధుడు ఉండటానికి నివాసం లేకపోవడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో గల ఈవీఆర్‌ పెరియార్‌ సలై రోడ్డు పుట్‌పాత్‌పై భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయితే కరోనా వైరస్‌ భయంతో స్థానికులు ఎవరూ మృతదేహాన్ని టచ్‌ చేయలేదు. పోలీసులకి సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో రిక్షాలో మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు. కాగా, దాదాపు 4 గంటల పాటు మృతదేహం రోడ్డుపైనే ఉందని స్థానికులు చెబుతున్నారు. (చదవండి : క‌రోనా లేదని మొత్తుకున్నా విన‌లేదు, చివ‌రికి!)

ఇలాంటి ఘటనే మరొకటి ఈ నెల 12న మహారాష్ట్రలోని జల్గావ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఓ వృద్ధ మహిళ(82).. ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని టాయిలెట్‌లో నుంచి బయటకు తీశారు. ఆస్పత్రిలోని రోగులంతా మృతదేహాన్ని చూసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చివరకి దుర్వాసన భరించలేక కరోనా పేషెంట్లు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.

>
మరిన్ని వార్తలు