నా భార్యను తీసుకొస్తారా, లేదా?

24 May, 2016 11:05 IST|Sakshi
నా భార్యను తీసుకొస్తారా, లేదా?

ఫిరోజాబాద్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన భార్యను వెతికి పెట్టాలంటూ ఓ భర్త విద్యుత్ టవర్ ఎక్కాడు. ఐదు గంటల పాటు టవర్ పైనే గడిపిన అతడు ఉన్నతాధికారుల హామీతో కిందకు దిగి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ లోని అసఫాబాద్ పవర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు పిల్లల తండ్రైన రాంప్రసాద్(40) హైటెన్షన్ స్తంభం ఎక్కి హడావుడి చేశాడు.

20 రోజుల క్రితం తనను వదిలి వెళ్లిపోయిన భార్యను తీసుకురావాలని డిమాండ్ చేశాడు. తన భార్యను తీసుకురాకుంటే కిందకు దూకేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అధికారులు స్పష్టమైన హామీయివ్వడంతో కిందకు దిగొచ్చాడు. ప్రసాద్ తో గొడవపడి అతడి భార్య వెళ్లిపోయిందని ఫిరోజాబాద్ ఎస్పీ ఓంకార్ యాదవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే ప్రసాద్ కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే ఆమె వెళ్లిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

కాగా, హైటెన్షన్ టవర్ ఎక్కి న్యూసెన్స్ చేసినందుకు రాంప్రసాద్ పై పోలీసులు కేసు పెట్టారు. మరోవైపు అతడు సృష్టించిన హంగామాతో సమీప ప్రాంతాలకు 5 గంటల పాటు కరెంట్ లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు