మెట్రో రైలులో యువతికి చేదు అనుభవం

13 Feb, 2020 18:09 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: మహిళలు ఎంతో భద్రతగా భావించే మెట్రో రైలులో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎదురుగా నిలబడ్డ ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో బెంబేలెత్తిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ వికృత ఘటన బుధవారం ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్‌ మార్గంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... విధులు ముగించుకుని మహిళా ఉద్యోగిని సాయంత్రం 6 గంటల సమయంలో గుర్గావ్‌ వెళ్లేందుకు ఢిల్లీ మెట్రో రైలు ఎక్కింది. ఆ సమయంలో అదే రైలులో ఉన్న ఓ యువకుడు తన ప్రయివేట్‌ పార్ట్స్‌ చూపిస్తూ యువతికి అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో భయకంపితురాలైన ఆమె ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూసింది. సుమారు ఓ నిమిషం పాటు బ్యాగును అడ్డుపెట్టుకుంటూ, తీస్తూ సదరు వ్యక్తి మరింత వెకిలిగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి... స్నేహితురాలి సహాయంతో అతని ఫొటోను సంపాదించి.. తనకు జరిగిన ఘోర అనుభవాన్ని ట్విటర్‌లో రాసుకొచ్చింది.(దోచుకున్న సొమ్ముతో ఇళ్లు..షికార్లు!)



యువతి ట్వీట్‌పై స్పందించిన ఢిల్లీ మెట్రో యజమాన్యం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే హెల్ప్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని, లేదంటే దగ్గర్లో ఉన్న మెట్రో అధికారులను సంప్రదించాలని సూచించింది. తద్వారా దుండగులపై వెంటనే చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని పేర్కొంది. ఇక మెట్రో స్పందనతో పాటు, స్నేహితురాలి ప్రోద్బలంతో ధైర్యం తెచ్చుకున్న యువతి ఈ ఘటనపై గురువారం ఫిర్యాదు చేసింది. అయితే అతను ఎక్కడ దిగిపోయాడో మాత్రం తనకు తెలీదని చెప్పుకొచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. (నాలుగేళ్ల ప్రేమ అర్థాంతరంగా..)

మరిన్ని వార్తలు