కారులో మంటలు.. ఫోన్స్‌తో బిజీగా జనాలు

9 Nov, 2018 09:36 IST|Sakshi
తగలబడిపోతున్న కారు

గురుగ్రామ్‌ : నడిరోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఒక్కరు స్పందించకపోవడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. హర్యానా, గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్‌ ఫ్లైఓవర్‌పై మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన.. జనాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇక ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. మ్యాన్‌పవర్‌ సంస్థ ఉద్యోగైన రాకేశ్‌ చందెల్‌ (44) తన కారులో ఇంటికి వస్తుండగా ఆకస్మాత్తుగా కారులో మంటలు సంభవించాయి. ఇది గమనించిన రాకేశ్‌  ఆ కారులో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. అనంతరం తన కారులోని మంటలార్పేందుకు శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. రాకేశ్‌ బయటకు వచ్చిన తరువాత కూడా ఆ కారు అలాగే కొద్దీ దూరం వెళ్లింది. ఈ కారుతో పరిగెత్తిన రాకేశ్‌.. ఎదురుగా వచ్చిన ఆటోను అక్కడికి వచ్చిన అధికారులు తప్పించారు.

ఈ ఘటనపై రాకేశ్‌ మాట్లాడుతూ.. ‘కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదో వింత శబ్దం రావడంతో దిగి కారు టైర్లు చెక్‌ చేసాను. అప్పుడు ఎలాంటి మంటలు లేవు. అయినా ఆ శబ్దం ఆగలేదు. కారు ఫ్లైఓవర్‌ ఎక్కగానే నిమిషాల్లోనే మొత్తం మంటలు వ్యాపించాయి. బ్రేక్స్‌ వేసినా కారు ఆగలేదు. వెంటనే డోర్‌ తీసి బయటకు దూకాను. పోలీస్‌, ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చా. సాయం చేయాలని ఎంత అరిచినా ఒక్కరు స్పందించలేదు. వారంతా మొబైల్స్‌లో ఈ ఘటనను రికార్డు చేస్తూ బిజీగా ఉన్నారు. కనీసం మంచినీళ్లను కూడా ఎవరు ఇవ్వలేదు’ అని అవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

>
మరిన్ని వార్తలు