పర్లాకిమిడి : గుర్తు తెలియని కొంతమంది దుండగులు మోటార్ సైకిల్పై వస్తున్న ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కాశీనగర్ బ్లాక్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.
వివరాలిలా ఉన్నాయి..
కె.సీతాపురం పంచాయతీలోని బిసిరింగి గ్రామ రోడ్డులో బైక్పై వస్తున్న వ్యక్తి తలపై గుర్తు తెలియని దుండగులు ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. మృతుడిని కాశీనగర్ బ్లాక్లోని భూపతి లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంజీవరావు(38)గా పోలీసులు గుర్తించారు.
సంజీవరావును చంపేందుకు దుండగులు ఆ గ్రామంలోని ఓ కల్వర్టు కింద కాపు కాసినట్లు విచారణలో తేలిందని ఐఐసీ అధికారి బబులీనాయక్ తెలిపారు. కుట్ర నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని, ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని కాశీనగర్ పోలీస్ అధికారి ఆనందచంద్ర పాత్రో తెలిపారు.